మమతా బెనర్జీని కౌగలించుకుంటానంటున్న బీజేపీ నేత!!

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (21:13 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశంలోని మహిళా ఫైర్‌బ్రాండ్లలో ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో ధైర్యంగా నిలదీస్తున్న మహిళా నేత. అలాంటి మహిళను ఓ బీజేపీ నేత నేరుగా వెళ్లి కౌగలించుకుంటానని ప్రకటించారు. ఆయన పేరు అనుపమ్ హజ్రా. ఇటీవలే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా, ఆయన జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగలించుకుంటానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుతో ఆయనపై సిలిగిరి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
కాగా, ఇంతకీ ఆయన అలా ఎందుకు మాట్లాడారో ఓసారి పరిశీలిస్తే, కరోనా వ్యాప్తి మొదలయ్యాక పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందని ఆరోపించారు. "నాకు కూడా ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుంది. అప్పుడు నేరుగా వెళ్లి మమతా బెనర్జీని కౌగిలించుకుంటా. అప్పుడు ఆమెకు కూడా కరోనా వస్తుంది. అప్పుడు కానీ ప్రజలు పడుతున్న కష్టమేంటో ఆమెకు అర్థం కాదు. తమ వారిని కోల్పోయిన ప్రజల ఆవేదన అప్పటికిగాని ఆమెకు తెలిసిరాదు" అంటూ వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు