వివాహేతర బంధానికి అడ్డు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

మంగళవారం, 19 జనవరి 2021 (11:14 IST)
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహకారంతో భర్తను కడతేర్చిందో భార్య. ఆపై సహజ మరణమంటూ నాటకమాడినా తప్పించుకోలేకపోయింది. పంజాగుట్ట పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్య కుష్బుదేవీ(32), పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులతో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 
 
2019లో ఖైరతాబాద్‌లో జ్యూస్‌ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇందులో పనిచేసేందుకు లాల్‌ బాబు(35) అనే తన బంధువును నియమించాడు. ఈ క్రమంలో కుష్బుదేవికి లాల్‌బాబుకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర బంధానికి దారి తీసింది. ఆరు నెలల క్రితం అతడు తన భార్య మృతిచెందడంతో బిహార్‌ వెళ్లాడు. చాలాకాలం రాకపోవడంతో అతడ్ని జూస్‌ పాయింట్‌ నుంచి తొలగించాడు లక్ష్మణ్‌జా. తర్వాత వచ్చిన లాల్‌బాబు హోటల్‌లో పనికి చేరాడు. కుష్బుదేవితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ వివాహేతర బంధాన్ని కొనసాగించసాగాడు.
 
విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన కుష్బుదేవి అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిపించింది. భర్త ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించగా లాల్‌బాబు కదలకుండా చేతులను పట్టుకోవడంతో అతను మరణించాడు. 
 
మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదికలో మృతుని ఒంటిపై గాయాలు, బలంగా ఊపిరి ఆడకుండా చేసినట్టు తేలడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు