సీఎం మమత ఇంటివద్ద కలకలం.. ఆయుధాలతో చొరబాటుకు యత్నం

శుక్రవారం, 21 జులై 2023 (14:46 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద శుక్రవారం కలకలం చెలరేగింది. కొందరు దుండగులు ఆయుధాలతో ఆమె నివాసంలోకి దూరేందుకు ప్రయత్నించగా, ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్టు చేసింది. అతడిని నూర్‌ ఆలంగా గుర్తించారు. కోటు, టై ధరించిన అతడు.. పోలీస్‌ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో కోల్‌కతా నగరంలోని కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అరెస్టు చేశారని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు.
 
"ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి. గంజాయి కూడా దొరికింది. బీఎస్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. అతడు సీఎంను కలవాలనుకున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్నాం" అని సీపీ వెల్లడించారు. అతడి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకుగానూ మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది. 
 
రాజకీయ కారణాలతోనే చిన్నాన్న హత్య : షర్మిళ
 
ఏపీలో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా, సీబీఐ అధికారులు మరో కీలక అంశాన్ని బహిర్గతం చేశారు. ఈ కేసులో ఓ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ఆర్ కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిళను ఓ సాక్షిగా చేర్చారు. ఈ మేరకు కోర్టుకు సీబీఐ సమర్పించిన చార్జిషీటులో పేర్కొన్నారు.
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, షర్మిళ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఇందులో ఆమె 259వ సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. గత యేడాది అక్టోబరు ఏడో తేదీన ఢిల్లీలో షర్మిళ సాక్ష్యం ఇచ్చారు. "నా వద్ద ఆధారాలు లేవు కానీ, రాజకీయ కారణాలతో హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక కారణాలు కాదు. పెద్ద కారణం వుంది" అంటూ ఆమె వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయం తాజాగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది.  
 
వివేకా హత్య కేసులో వారిద్దరి కుట్రవుంది : సీబీఐ 
 
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ భాస్కర్ రెడ్డిలు కుట్ర పన్నారని సీబీఐ అభియోగం మోపింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించిన చార్జిషీటులో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్‌ డేటాలు, ఫోటోలను కోర్టుకు సమర్పించిది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. 
 
వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది. సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూట్లకు కనెక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్టు చెప్పారు. వివేకా రాసిన లేఖపై నిన్ హెడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి వుందన్నారు. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సింక్ రిపోర్టులు త్రివేండ్రం సిడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు