వరలక్ష్మీ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో చేయొచ్చా?

బుధవారం, 22 ఆగస్టు 2018 (14:57 IST)
శ్రావణమాసంలో పూర్ణిమకు అంటే పున్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు 24, 2018) నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానమాచరించి.. పట్టుచీరలను ధరించాలి. పూజగదిని శుభ్రపరుచుకుని.. పుష్పాలతో అలకరించుకోవాలి. కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి.
 
శ్రీ వరలక్ష్మిని కీర్తిస్తూ.. ఆవాహనం చేసిన వరలక్ష్మీని ధ్యాన ఆవాహ నాది షోడశోపచారాలతో, అష్ణోత్తరశత నామాలతో అర్చించి అనేక విధాలైన భక్ష్యాలను, పిండివంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేయబడిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకుని భక్తిగా ప్రదక్షిణ, నమస్కారాలు సమర్పించాలి. ఇంటికొచ్చిన ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి. 
 
ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంగారు ఆభరణాలకు లోటుండదు. సమస్త సంపదలు తులతూగుతాయి. శ్రావణమాసంలో వీలుకాని సందర్భంలో మాత్రమే మహిమాన్వితమైన వరలక్ష్మీవ్రతాన్ని వదలిపెట్టకుండా గృహిణులు ఆశ్వయుజమాసంలో నిర్వహించడం శుభకరమని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతాన్ని ప్రదోష సమయంలో పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పూట సాయంత్రం ప్రదోషం సమయం ముగిసిన తర్వాత లక్ష్మీ పూజ చేయడం సత్ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు