భరణి నక్షత్రం రోజున శ్రీవారి దర్శనం చేసుకుంటే..? (video)

శనివారం, 26 సెప్టెంబరు 2020 (05:00 IST)
భరణి నక్షత్రం రోజున శ్రీవారి దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. భరణి నక్షత్రం అక్టోబర్ 5 సోమవారం నాడు వస్తోంది. శ్రీనివాసునికి ప్రీతికరమైన శనివారం రోజున భరణి నక్షత్రం వుంటే ఇంకా విశేష ఫలితాలుంటాయని వారు చెప్తున్నారు. 
 
పూర్వం గౌతముడు అనే మహా తపస్వి ఉండేవాడు. మహా తపస్సంపన్నుడైన గౌతముడికి మరణానంతరం ఉత్తమ లోకాలను పొందాలనే ఆలోచన కలిగింది. దీనికోసం విశ్వజిత్ అనే మహాయాగాన్ని ఆచరిస్తాడు. ఆ సమయంలో అనేకదానాలు చేస్తాడు. చివరకు గోదానం చేయాల్సి ఉంది. 
 
ఇంతలో అతని కొడుకు నచికేతుడు గోశాలలో గోవులన్నీ ఏ మాత్రం ఓపిక లేనివై ఉన్నాయి. ఇటువంటి గోవులను సద్బ్రాహ్మణులకు దానం చేస్తే పుణ్యం రాకపోగా పాపం వస్తుందని నచికేతుడు తలచాడు. ఏ విధంగానైనా గోదానాన్ని మాన్పించాలని భావిస్తాడు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లి ఈ యాగం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నావు. చాలా దానాలు చేశారు.
 
మరి నన్ను ఎవరికి దానం ఇస్తావు అని పలుమార్లు అడుగుతాడు. రెండుమూడుసార్లు గౌతముడు నిదానంగా నాయనా నిన్ను దానం ఇవ్వను. ఇదేం ప్రశ్న. నా కార్యానికి ఆటంకం కలిగించకు వెళ్లు అంటాడు. కానీ తిరిగి తిరిగి నచికేతుడు తండ్రిని అదే ప్రశ్న వేయడంతో గౌతముడు నిన్ను ఆ యమధర్మరాజుకు దానం చేస్తాను అంటాడు. అంతే వెంటనే యముడు ప్రతక్ష్యం అయి నచికేతుడుని తీసుకువెళ్లాడానికి సిద్ధమవుతాడు. 
 
ఇంతలో నచికేతుడు యమధర్మరాజుకు నమస్కారం చేసి ఆత్మ స్వరూపం, జన్మజన్మల రహస్యం చెప్పవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు యముడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రహస్యాన్ని చెప్పకూడదు అని అంటాడు. అటు తర్వాత వీరిద్దరి మధ్య అనేక ధర్మసూక్ష్మాలపై చర్చ జరుగుతుంది. నచికేతుని అపార విద్యావంతునిగా గ్రహించి అతనికి బ్రహ్మోపదేశం చేస్తూ ఆత్మస్వరూపం, జన్మల రహస్యాన్ని చెప్తాడు. ఆ పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తాడు. ఓంకార స్వరూపుడైన పరమాత్మను ఎవరు ఎల్లవేళలా తలుస్తూ, ఉంటారో వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది.. అని చెప్తాడు.
 
ఎవరైతే నక్షత్రాలతో రెండోదైన భరణీ నక్షత్రం రోజున శ్రీనివాసుడుని దర్శిస్తారో వారికి అకాల మృత్యుభయం ఉండదు. కారణం భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు. ఆ నక్షత్రం ఉన్నరోజు ప్రాతఃకాలంలో శ్రీ వేంకటేశ్వర దర్శనం చేస్తే ఆయన అనుగ్రహం వల్ల యమగండాలు, దోషాలు పోతాయి. దీంతోపాటు భరణీ నక్షత్రం రోజు కుజుని ఆరాధిస్తే ఆర్థిక, ఆరోగ్య బాధలు పోతాయి. 
 
ఇక ఆలస్యమెందుకు భరణీ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకుని ఆ కలియుగ దైవాన్ని దర్శించుకుందాం. తిరుమలకు పోవడం వీలుకాకుంటే మీ దగ్గర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి అర్చించడం చేస్తే చాలు. శ్రీనివాసుని కృపకు పాత్రులమవుతాం.. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు