నవరాత్రుల్లో ఆరో రోజు.. శ్రీలక్ష్మిని.. అన్నపూర్ణమ్మను పూజిస్తే..?

గురువారం, 22 అక్టోబరు 2020 (05:00 IST)
నవరాత్రుల్లో ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించాలి. అమ్మవారికి రవ్వ కేసరిని సమర్పిస్తే సకల సంపదలు చేకూరుతాయి. రెండు చేతులలో కమలాలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. 
 
అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని పూజిస్తే ఫలితాలు త్వరగా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.
 
"ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీలక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి. నైవేద్యంగా పూర్ణాలను పెట్టాలి.
 
అలాగే.. నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు