వీణాపాణీయుడై సరస్వతీమూర్తిగా విహరించనున్న శ్రీవారు

ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (12:57 IST)
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఐదు తలల చిన్న శేషవాహనంపై విహరించారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న శేషవాహనాన్ని నాగ జాతిలో అనంతుడైన వాసుకిగా పురాణాలు పేర్కొన్నాయి. చిన్న శేషవాహనాన్ని దర్శించే భక్తులకు దివ్య చైతన్యం ద్వారా కుండలినీ యోగఫలం లభిస్తుందని ప్రతీతి. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల లోపు మలయప్పస్వామి వీణాపాణీయుడై సరస్వతీమూర్తిగా హంస వాహనంపై దర్శనమిచ్చారు. 
 
పరమశివుని హస్తాభరణంగా, కంఠాభరణంగా విరాజిల్లే వాసుకి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీవారు చిన్నశేష వాహన సేవలో తరించాడు. ఈ వాహన సేవను దర్శించి, ధ్యానించేవారికి మనసు, కర్మ శ్రీనివాసుని అధీనమై, ఆయనకు అభిముఖమవుతాయని, అప్పుడు మానవుడు మాధవునికి నిజమైన సేవకుడవుతాడని పెద్దలు చెబుతారు.
 
కాగా, తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారిని శనివారం 58,827 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,879 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.38 కోట్లుగా వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు