నుదుటన మూడు నామాలతో శ్రీవారికి పట్టువస్త్రాలిచ్చిన సీఎం జగన్

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (19:24 IST)
తితిదే బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల వేంకటేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. నుదుటున మూడు నామాలు పెట్టుకుని ఎంతో భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గరుడవాహన సేవలో పాల్గొన్నారు. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
 
కాగా, మంగళవారం కేంద్రం పిలుపుతో ఉన్నఫళంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్... అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి తదితరులు స్వాగతం పలికారు. ఈ రాత్రికి సీఎం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. గురువారం ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
 
అంతకు ముందు తిరుమలలో ఉన్న అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కరోనాకు సంబంధించి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
కాన్ఫరెన్సుకు ముందు ముఖ్యమంత్రిని తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కలిశారు. అయితే, శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత మాట్లాడుతానని ఆయనకు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో రమణ దీక్షితులు మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల అంశం ఇంకా పెండింగ్‌లో ఉందని... దాని గురించి మాట్లాడేందుకు సీఎంని కలిశానని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు