చూడముచ్చటగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు : సింగిల్ బెడ్రూం - అటాచ్డ్ వాష్‌రూం.. కిచెన్...

ఠాగూర్

సోమవారం, 11 మార్చి 2024 (14:10 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభోత్సవం చేశారు. భద్రాచలంలో ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా, సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తారు. స్థలం లేనివారికి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తారు. ఒక యేడాదిలో 4.5 లక్షల గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వం పలు నమూనాలను సిద్ధం చేసింది. ప్రతి డిజైన్‌లోనూ కిచెన్, టాయిలెట్ ఉండేలా తీర్చిదిద్దారు. 
 
తొలి నమూనాలో సింగిల్ బెడ్రూమ్, కిచెన్, అటాచ్డ్‌ వాష్ రూం, వాల్, కామన్ బాత్రూమ్, ఇంటిపైకి వెళ్ళేందుకు మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకునేందుకు కొంత ఖాలీ స్థలం, బాల్కనీ, బైకు పార్కింగ్ కోసం స్థలం, ఇంటి చుట్టూత ప్రహరీ గోడ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. 
 
ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున మొత్తం 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా 33500 గృహాలను రాష్ట్ర రిజర్వు కోటా కింద అట్టిపెట్టింది. ఈ పథకం అమలు కోసం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో 92 వేల ఇళ్లను నిర్మించనుంది. గ్రామాల్లో 57 వేలు, పట్టణ ప్రాంతాల్లో 38 వేల గృహాలను నిర్మిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు