తెలంగాణాలో బీజేపీకి షాక్ - పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహన్

ఠాగూర్

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (15:01 IST)
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి షాకులపై షాకులు తగలుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ కూడా రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు పంపుతున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తాను పార్టీలో ఇమడలేకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. అందుకే ఇపుడు పార్టీ నుంచి తప్పుకోవాలని భావించి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలో నిత్యం తనకు అవమానాలు పెరిగిపోయాయని ఆరోపించారు. 
 
కిషన్ రెడ్డికి ఫోన్లు చేస్తున్నా ఆయన తీయడం లేదని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను వరంగల్ లోక్‌సభకు పోటీ చేస్తానని చెప్పానని తెలిపారు. ఏ పార్టీ అయిన బాగా పని చేసిన వారిని ఉండాలని కోరుకుంటుందని, కానీ తెలంగాణా బీజేపీలో మాత్రం పనిచేసే వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తనలాంటివారు బీజేపీలో పని చేయడం కష్టమన్నారు. అదేసమయంలో తాను ఏ పార్టీలోకి వెళ్లాలనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని చెప్పారు. 
 
సహజీవనం చేస్తే ఆర్నెల్లు జైలుశిక్ష 
 
ఉత్తరాఖండ్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇకపై లివిన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని లేకపోతే జైలుశిక్ష తప్పదని పేర్కొంది. ఈ బిల్లులను జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. మరోవైపు, ఈ బిల్లు చట్టంగా మారితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సహజీవనం చేయడానికి కూడా తమ పేర్లను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టంగా మారితో లివిన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలనుకునేవారు యువతీయువకులతో పాటు ఇప్పటికే అందులో ఉన్నవారు తప్పకుండా జిల్లా అధికారుల వద్ద తమ బంధాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారి వయసు 21 యేళ్ళు నిండి ఉండటంతో పాటు తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
 
అయితే, ఇది ప్రజా నైతికతకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం రిజిస్టర్ చేయరు. అంటే జంటలో ఒకరికి ఇప్పటికే వివాహమైనా, మరొకరితో రిలేషన్‌లో ఉన్నా, భాగస్వామి మైనర్ అయినా ఆ బంధాన్ని రిజిస్టర్ చేయరు. అలాగే, బలవంతంగా కానీ, గుర్తింపు వంటివాటిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు. రిజిస్టర్ చేయించుకోకుండా సహజీవనం చేస్తే ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించేలా నిబంధన పెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు