సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం లక్షణాలు ఇంకా పోలేదు : బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

ఠాగూర్

సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (10:58 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిలో తెలుదేశం పార్టీ లక్షణాలు ఇంకా పోలేదని భారత రాష్ట్ర సమితి నేత వినోద్ కుమార్ అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ వంటి గుర్తులను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరికపు చిహ్నాలంటూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 11, 12 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశ పాలకులుగా ఖ్యాతి గడించిన కాకతీయులు రాచరికం నుంచి వచ్చిన వాళ్లు కాదని స్పష్టం చేశారు. వారు పేదల కోసం పాటుపడిన మహనీయులు అని కొనియాడారు. కాకతీయుల ఘనచరిత్రకు నిలువెత్తు నిదర్శనం కాకతీయ కళాతోరణం అని వినోద్ కుమార్ గుర్తు చేశారు. 
 
ముఖ్యంగా, మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సారనాథ్ స్థూపం నుంచి మూడు సింహాలు, అశోక చక్రం చిహ్నాలను భారతదేశ అధికారిక చిహ్నంలోకి తీసుకున్నారని, మరి అవి రాచరిక వ్యవస్థకు సంకేతాలు కాదా అని వినోద్ ప్రశ్నించారు. సీఎంకు ఇంకా టీడీపీ నుంచి వచ్చిన లక్షణాలు పోయినట్టు లేదని అన్నారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస, వ్యవసాయం, చరిత్రను తుడిచేయాలని ఆంధ్రా పాలకులు భావించారని, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా వాళ్లలాగానే ఆలోచిస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి... ఎవరో చెప్పిన వాటిని విని ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కాకతీయులు పాలించిన వరంగల్ నుంచి మంత్రులుగా ఉన్న సీతక్క, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు