13 దేశాల ప్రతినిధులకు రేవంత్ రెడ్డి ఆతిథ్యం...

ఠాగూర్

గురువారం, 11 జనవరి 2024 (10:25 IST)
హైదరాబాద్ నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఆతిథ్యం ఇచ్చారు. ఇందులో అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాలకు చెందిన ప్రితినిధులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. ‘అభయహస్తం’ గొడుగు కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 
 
ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని వారిని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు రవి, మంత్రులు దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరలు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు