ఉద్యోగం అక్కర్లేదు.. డబ్బు, - భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను.. మాజీ డీఎస్పీ నళిని

ఆదివారం, 31 డిశెంబరు 2023 (10:18 IST)
తనకు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదని, ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నానని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. అందువల్ల ఇపుడు తనకు డబ్బు వద్దని, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డానని తెలిపారు.  
 
ప్రత్యేక తెలంగాణ కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని.. ఆ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆమెను గత ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో శనివారం సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు చెప్పారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో వేదం, యజ్ఞం పుస్తకాలను పూర్తి చేస్తున్నానని... ఆ తర్వాత సనాతన ధర్మ ప్రచారం చేస్తానని వెల్లడించారు.
 
తాను ఉద్యోగం చేసిన సమయంలో తాను... తన సహోద్యోగులు డిపార్టుమెంట్లలో ఎదుర్కొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని, అలాంటి ఇబ్బందులు మరొకరికి జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలోనే తనకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నట్లు తెలిపారు. తన విషయంలో జరిగిన అన్ని పరిణామాలను
 
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇన్నాళ్ల తన మనోవ్యధను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. ఇప్పుడు తన మనసుకు నచ్చిన ఆధ్యాత్మిక సేవను చేస్తున్నానని, అందువల్ల తనకు ఇపుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు