అయోధ్య నగరానికి ఎయిరిండియా విమాన సర్వీసులు

బుధవారం, 20 డిశెంబరు 2023 (16:21 IST)
రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అయోధ్యకు ఎయిరిండియా సంస్థ విమాన సర్వీసులను నడుపనుంది. ఇందులోభాగంగా ఈ నెల 30వ తేదీన అయోధ్యకు విమాన సర్వీసును నడుపనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత జనవరి 16 నుంచి ఈ మార్గంలో ప్రయాణికులకు రోజువారీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. IX 2789 విమానం డిసెంబర్‌ 30న ఢిల్లీలో ఉదయం 11గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. 
 
అలాగే, అదేరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు అయోధ్యలో బయల్దేరి మధ్యాహ్నం 2.10గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందన్నారు. అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగిన వెంటనే అక్కడికి తమ సర్వీసులు నడిపేందుకు ఉత్సాహంగా ఉన్నామని.. ఇది దేశ వ్యాప్తంగా టైర్‌ 2, టైర్‌ 3 నగరాల నుంచి కనెక్టివిటీని పెంచాలన్న తమ నిబద్ధతకు నిదర్శనమని ఎయిరిండియా ఎండీ అలోక్‌ సింగ్‌ తెలిపారు.
 
మరోవైపు, ఢిల్లీ నుంచి అయోధ్య విమానాశ్రయానికి డిసెంబర్‌ 30న తొలిసారి విమానం నడపనున్నట్లు ఇప్పటికే ఇండిగో ప్రకటించింది. ఆ తర్వాత జనవరి 6 నుంచి రోజువారీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దాదాపు రూ.350 కోట్లతో అభివృద్ధి చేసిన అయోధ్య విమానాశ్రయం కోసం ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను డిసెంబర్ 14న జారీ చేసింది. ఈ నెలాఖరుకు విమానాశ్రయం సిద్ధమవుతుందని.. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవల విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు