నేడు దేశ వ్యాప్త బంద్ : ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (09:52 IST)
పార్లమెంట్ నుంచి విపక్ష పార్టీలకు చెందిన 146 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీన కొందరు దుండగులు లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి పొగబాంబులను వదిలి నానా హంగామా సృష్టించారు. బీజేపీ ఎంపీ సిఫార్సు లేఖ ద్వారానే వారు లోక్‌సభలోకి ప్రవేశించారు. ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. 
 
దీంతో పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 146 మంది పార్లమెంట్ సభ్యులను సభ నుంచి స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ఈ చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందించి అన్ని రాష్ట్రాల్లో నిరసనలు మొదలయ్యాయి. ఇందులోభాగంగా, హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు