తొమ్మిది టీవీ - సోషల్ మీడియా చానెల్స్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఠాగూర్

ఆదివారం, 31 మార్చి 2024 (11:01 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన గురించి, తమ కుటుంబం గురించి అసత్య కథనాలు ప్రచురిస్తున్న తొమ్మిది టీవీ చానెల్స్, సోషల్ మీడియా చానెల్స్‌కు లీగల్‌ నోటీసులు పంపించారు. కుట్రలో భాగంగా, అజెండాలో భాగంగా తమపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. సంబంధం లేదని అంశాల్లో తమ పేరును, ఫోటోలను వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ వీడియోలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫొటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్‌పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తొమ్మిది మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా కేటీఆర్ నోటీసులు పంపించారు.
 
కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేసేందుకు అసత్య ప్రచారాలను, కట్టుకథలను అల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తనకు, తమ కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతో ఛానెల్స్, మీడియా సంస్థలు, పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. పక్కా అజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. అసలు తమకు సంబంధం లేని పలు అంశాల్లో తమ పేరును, ఫొటోలను వాడుతూ హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఛానల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
 
కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరంతా చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా మాకు సంబంధంలేని అంశాలను అంటగడుతూ చేసిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు ప్రణాళికతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు