అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తెరాస.. లెఫ్ట్ పార్టీలకు మొండిచేయి

మంగళవారం, 22 ఆగస్టు 2023 (14:28 IST)
ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ముచ్చటగా మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో లెఫ్ట్ పార్టీల నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు సీఎం కేసీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి భారాస, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు ఖంగుతిన్నాయి. సీపీఐ, సీపీఎంలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించాయి. 
 
సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం భారాస, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను తోసిపుచ్చిన లెఫ్ట్ నేతలు తలా మూడు అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టారు. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. 
 
సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. వీటికి అదనంగా పాలేరు, మిర్యాలగూడెంలో ఏదో ఒకటి ఇవ్వాలని సీపీఎం.. కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ ఒకటి చొప్పున ఇవ్వాలని సీపీఐ కోరాయి. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని భారాస పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు. ఇపుడు భారాస ఒంటిరిగా పోటీ చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు