ప్రియుడితో కుమార్తె లేచిపోయిందనీ.. ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్ దంపతులు...

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:01 IST)
కొందరికి పరువు కంటే ప్రాణాలు గొప్పవి కాదని భావిస్తుంటారు. అలాంటివారు తమ పరువుకు ఏమాత్రం భంగం కలిగినా తట్టుకోలేరు. ఈ క్రమంలో తమ కుమార్తె ఓ వ్యక్తితో లేచిపోవడాన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్ దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన పల్లకొండ నారాయణ(45), భార్య రాజేశ్వరి(40) అనే దంపతులు ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా కందిలో నివాసం ఉంటున్నారు. 1995కు బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ నారాయణ గతంలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించాడు. ప్రస్తుతం జిన్నారం మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నిహారికకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వేరు వ్యక్తితో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ తన విధులకు సెలవు పెట్టి ఇంటికొచ్చారు. తన కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుదని తట్టుకోలేక భార్యాభర్తలిద్దరు తీవ్రంగా కుమిలిపోయారు. 
 
పెళ్లి కుదిరిన తర్వాత కూడా తన కూతురు ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఈ విషయం బంధులవులకు తెలిస్తే పరువు పోతుందని ఆ దంపతులు తీవ్రంగా మథనపడ్డారు. తీవ్రంగా మనోవేదనకుగురై ఆ దంపతులు క్షణికావేశంలో ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ సృజన, డీఎస్పీ బాలాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు