హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బతికించాల్సిందే:మంత్రి హరీష్

సోమవారం, 15 జూన్ 2020 (22:13 IST)
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను బ్రతికించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు.

సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, 1,200 మంది అధికార యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.

ప్రభుత్వం ఇప్పటికే ఐదు విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టగా అది పూర్తిగా విజయవంతమైందని ,ఈ నెల 20వ తేదీ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సన్నద్దం కావాలని సూచించారు.

ఈ విడతలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వాటిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. నర్సరీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నాటేందుకు వీలుగా ఉన్న అన్ని మొక్కలను నర్సరీల్లో ఎదుగుదలతో ఉండాలని వివరించారు.

హరిత హారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వడం, ట్రీ గార్డులు వంటివి ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి హరీష్రావు సూచించారు. ఏడాది కన్నా పెద్దగా ఉన్న మొక్కలను నాటాలని... ఆబ్కారీ (ఎక్సైజ్) డిపార్టుమెంట్ వారి ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటాలని... ఈత చెట్ల వల్ల రానున్న రోజుల్లో ఆదాయం సమకూరుతుందని మంత్రి అన్నారు. 

అలాగే అన్న మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో నిధులలో పది శాతం నిధులను హరితహారం కార్యక్రమానికి వినియోగించాలన్నారు. ఇప్పటి నుంచి ట్రీగార్డులు, అవెన్యూ ప్లాంటేషన్కు అవసరమైన ప్లానింగ్ చేసుకోవాలని... అవసరమైన చోట గుంతలను తీసి మొక్కలు నాటేందుకు సిద్దం చేసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రతి చోట ఇళ్ళల్లో ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. వైకుంఠదామాలకు, డంపుయార్డులకు బయో ఫెన్సింగ్ చేయాలని పేర్కొన్నారు.

అటవీ శాఖ వారు వృక్షజాతికి సంబంధించిన మొక్కలను పెంచుతుండగా... ఉపాధికి సంబంధించిన నర్సరీల్లో టేకు, ఈత, దానిమ్మ, నారింజ, కరివేపాకు, ఖర్జూర, అల్లనేరేడు, చింత, వేప మొక్కల వంటివి పెంచాలన్నారు. 

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్రావు సూచించారు. దీనికి గాను అధికార యంత్రాంగం గ్రామాలు,మున్సిపాలిటీల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

అలాగే ప్రజాప్రతినిధులందరూ అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములైనప్పుడే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయని స్పష్టం చేశారు.

దోమల నివారణకు అవసరమైన చర్యలను ప్రజలకు వివరించాలని... వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కాలువల్లో నీరు పారే విధంగా చూడటంతో పాటు ఇంటి నీటి ట్యాంకులపై మూత ఉంచాలని, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని ఈ విషయాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి హరీష్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నివాస ప్రాంతాల్లో ఫాగింగ్ చేయడంతో దోమల లార్వాలను నశింపచేసి బైటెక్ మందు పిచికారి చేయాలని, ఆయిల్ బాల్స్ను వాడాలని  అన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, పొదలను, పనికిరాని మొక్కలను తొలిగించి శుభ్రతను పర్యవేక్షించాలని... బస్టాండ్లు, మార్కెట్లు, స్కూళ్లు, దవాఖానాల పరిసరాలు, రేషన్‌షాపులు, బండ్ల స్టాండ్లలో ఒక శాతం సోడియం హైపోక్లోరైట్‌ ఫెనాలిక్‌ డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌తో పిచికారి చేయించాలన్నారు.

మురుగు కాలువల్లో చెత్తా చెదారం ప్లాస్టిక్ కవర్లు వేసి నీటి నిల్వకు కారణం కారాదని, చుట్టుపక్కల వాడి పడేసిన కొబ్బరిబొండాలు, టైర్లు ఉండకుండా చూడాలన్నారు. ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు  డెంగీ కేసులు వస్తాయని, అవి రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వోను మంత్రి హరీష్రావు ఆదేశించారు.

గ్రామస్థాయిలో సర్పంచ్ మొదలుకొని మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో పాటు  ఆర్డబ్ల్యుఎస్, ఇంజనీరింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా వివరించారు.

జిల్లా కలెక్టర్తో కలిపి డీపీవో, డీఎంహెచ్వో, ఆర్డబ్ల్యుఎఓస్, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో వ్యవహరించి సమిష్టిగా పని చేస్తేనే సీజనల్ వ్యాధులురాకుండా ఉంటాయని మంత్రి వివరించారు. కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాకులు ధరించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

అవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని, గోరు వెచ్చటి నీళ్ళు తాగడం, కరోనా వ్యాధి నిరోధించేందుకు సీ విటమిన్కు సంబంధించిన పండ్లయిన సంత్ర, ఉసిరి, నిమ్మ, బత్తాయి, జామ, మామిడి ఎక్కువగా తీసుకోవాలన్నారు.

వర్షాకాలం ప్రారంభమైన కారణంగా దోమలు, ఈగలు వృద్ది చెందుతాయని, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఆదివారం ప్రభుత్వం డ్రైడే నిర్వహిస్తుందని , క్షేత్రస్థాయిలో ప్రజాభాగస్వామ్యంతో ఖచ్చితంగా డ్రైడే అమలు జరిగేలా చూడాలని మంత్రి హరీష్రావు అధికారులకు సూచించారు.

గ్రామాలు, పట్టణాల్లో వార్డుల్లో నీటి గుంతలు కనబడకుండా అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కమిటీ, వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి టెలి కాన్ఫరెన్సులోడీ ఎంహెచ్వో తెలిపారు. వారం, పది రోజులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు ప్రాంతాల వారీగా  తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు.

మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ టెలీకాన్ఫరెన్స్లో సమీక్షలో మంత్రి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడతామని వివరించారు. 

వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, మరో వైపు కరోనా వ్యాధి వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనలు కల్పించేలా జిల్లా వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతామని కలెక్టర్ పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని , ఈ విషయంలో ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఇళ్ళల్లోనే ఉండాలని , ఇతర తీవ్రమైన జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో చింత చెట్లను పెంచాలని సూచించారు.

హరితహారంలో ప్లాస్టిక్ ట్రీగార్డులు కాకుండా ప్రతి ఒక్కరు ఇనుప (ఐరన్) ట్రీగార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు.  పంచాయతీ కార్యదర్శి, సర్పంచులతో  సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా మాట్లాడితే  వంద శాతం పనులవుతాయని అన్నారు.

గ్రామాల్లో ప్రధానంగా పిచ్చి మొక్కలు, చెత్తకుప్పలు, శిథిలాలదిబ్బలు లేకుండా చూడాలని సూచించారు. అలాగే  గ్రామంలోని అన్ని వీధులు,  ఇంటి ఆవరణ ,పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ ధర్మారెడ్డి వివరించారు.

ఈజీఎస్ లో గొర్రెలు ,బర్రెలు షెడ్లు నిర్మించుకోవడానికి, డ్రై ఇంగ్ ప్లాట్ఫామ్స్ , కోళ్ల షెడ్స్ కట్టుకోవడానికి, కంపోస్టు పిట్ నకు,  కూరగాయల పందిరి సాగుకు అవకాశం ఉన్నందున రైతులను ప్రోత్సహించాలని సూచించారు. 

రోడ్ల వెంట చెత్త లేకుండా డంప్ యార్డుకు తరలించాలని, ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను  వేరువేరుగా సేరించాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగమంతా సమన్వయంతో వ్యవహరించి కరోనాతో పాటు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు