GHMC Mayor post: కేసీఆర్‌ను కలిసిన మేయర్ బొంతు దంపతులు

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:07 IST)
KCR_Mayor Couple
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. 
 
సతీమణి బొంతు శ్రీదేవీ యాదవ్‌తో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. శ్రీదేవి.. చర్లపల్లి కార్పొరేటర్‌. వీరిద్దరూ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. కొత్త పాలకమండలి కొలువు దీరనున్న నేపథ్యంలో వారు కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
కాగా మరి కొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈనెల 11న గ్రేటర్‌లో కొత్త పాలక మండలి కొలువు తీరనుంది. అయితే ఈసారి గ్రేటర్ మేయర్ పీఠం మహిళకు ఇవ్వనున్నారు. దీంతో పలువురు ఆశవహులు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మేయర్‌ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తోన్న తరుణంలో ప్రస్తుత మేయర్‌ ప్రగతిభవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటి పాలకమండలి గడువు 10వ తేదీతో ముగియనుంది. మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో పలువురు రేసులో నిలుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఫలితాలు రాగానే మేయర్ రేసులో భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రస్తుతం ఆమె మేయర్ రేస్ నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు