పెళ్లి చేసుకుని రెండు నెలలకే నగదు, నగలతో యువతి జంప్

మంగళవారం, 4 జులై 2023 (13:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. పెళ్ళి చేసుకున్న ఓ యువతి భర్త ఇంటిలోని నగదు, నగలతో పారిపోయింది. తన సోదరి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పిన ఆ నవ వధువు... ఈ మోసానికి పాల్పడింది. ఆ తర్వాత తన భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్తపై తన కుటుంబ సభ్యులతో దాడి చేయించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో పెళ్లి కుమారుడు ఏం చేయాలో దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరీంనగర్, అన్నపూర్ణ కాలనీకి చెందిన సుద్దా రేవంత్ అనే వ్యక్తి భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేయగా, వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఓ యువతికి పెళ్ళి చేసుకునేందుకు ముందుకు వచ్చింది. దీంతో గత యేడాది డిసెంబరు నెలలో ఆ యువతిని రేవంత్ రెండో పెళ్ళి చేసుకున్నాడు. 
 
వివాహమైన రెండు నెలల తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పడంతో భర్త విస్తుపోయాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు  జరగడం ప్రారంభించాయి. భర్తతో ఓ రోజున భర్తతో ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకున్న యువతి... సోదరి ఇంటికి వెళ్లి వస్తాని ఈ యేడాది ఫిబ్రవరిలో రూ.70 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు ధరించి పారిపోయింది. ఆ తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోగా, ఫోను చేసినా స్పందించలేదు. 
 
దీంతో భర్త రేవంత్ ఆరా తీయగా ఆమె.. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఉన్నట్టు గుర్తించి, ఆమెను తీసుకొచ్చేందుకు భార్య వద్దకు మార్చి నెలలో వెల్లాడు. అక్కడికి వెళ్లాక తనను కొందరు బంధించి దాడి, రూ.10 లక్షలు కావాలని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరుపగా మూడు పెళ్ళిళ్లు అయినట్టు విచారణలో తేలడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు