తెలంగాణ మంత్రి సబితమ్మకు ఛాతీ నొప్పి?

శుక్రవారం, 15 మే 2020 (12:24 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రాత్రి అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు చాతినొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఆమె ఆరోగ్యంపై వైద్యులు స్పందిస్తూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలువురు నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. 
 
ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి తరలివెళ్లే ప్రయత్నాలు చేశారు. అభిమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో విద్యా శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లారని చెప్పింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఫలితాలన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయనీ, అందువల్ల ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అందులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు