షర్మిల మాటల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనిపించారు.. బ్రదర్ షఫీ

బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (22:15 IST)
తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌గా పేరుపొందిన బ్రదర్ షఫీ చేరనున్నారు. బుధవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలతో బ్రదర్ షఫీ సమావేశం అయ్యారు. ఆమె పెట్టబోయే పార్టీ గురించి, ఇతరత్రా అంశాలపై వైఎస్ షర్మిలతో పాటు మరికొందరు నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
తెలంగాణలో యువత, రైతులు, అన్ని వర్గాల వారు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే అంశం మీద వైఎస్ షర్మిల ప్లాన్ చెప్పారు. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల ప్లాన్ చేశారు.
 
దీనిపై మాట్లాడడానికి షర్మిల ఆహ్వానించారు. ముందు నుంచి మార్పుకోసం గొంతెత్తుతున్నా. ఇప్పుడు కలసి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గొప్ప నాయకత్వంతో వైఎస్ షర్మిల ముందుకొస్తున్నారు. ఆమెతో మాట్లాడినప్పుడు నాయకత్వ లక్షణాలు కనిపించాయి. ఆమె మాటల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనిపించారు. ఇదే ఆలోచనతో ముందుకు వెళితే మంచి మార్పు వస్తుంది. త్వరలోనే శుభవార్త వినబోతున్నారు.' అని బ్రదర్ షఫీ అన్నారు.
 
ఇకపోతే.. బ్రదర్ షఫీ అనే పేరు యూట్యూబ్‌లో బాగా ఫేమస్. ఆయన మోటివేషనల్ స్పీకర్. 'BR SHAFI నేను సైతం సమాజం కోసం' అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. ఆయనకు 1.71 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు