విద్యకు ఆన్ లైన్ యే లైఫ్ లైన్: గవర్నర్ తమిళిసై

బుధవారం, 26 ఆగస్టు 2020 (05:31 IST)
ఆన్ లైన్ ప్రస్థుత కోవిడ్ సంక్షోభ సమయంలో విద్యకు లైఫ్ లైన్ గా మారిందని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పరిస్థితులు భౌతిక పరిస్థితులలో విద్యాభ్యాసాన్ని ఆటంక పరిచినప్పటికీ, ఆన్ లైన్ పద్ధతులు, టెక్నాలజీతో విద్యాభ్యాసం కొనసాగించగలుగుతున్నామన్నారు. 
 
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐ టి), వరంగల్, ఆధ్వర్యంలో “ఆన్ లైన్ విద్య: అవకాశాలు, సవాళ్ళు” అన్న అంశంపై గవర్నర్ ఈరోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు కూడా చేరాల్సిన ఆవస్యకత ఉందన్నారు. 
 
ఆన్ లైన్ విద్యతో విద్యార్ధులు ఇంటికే పరిమితమై, స్కూల్, క్యాంపస్ లకు దూరంగా ఉన్న దృష్ట్యా, వారి శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన ఆరోగ్యం పట్ల తల్లితండ్రులు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డా. తమిళిసై సూచించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపట్టిన భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పన, డిజిటల్ ఇండియా మిషన్, డిజిటల్ క్లాస్ రూం పథకాల ద్వారా ఆన్ లైన్ విద్యా విధానం సులభతరమైందన్నారు. 

మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్ధులకు ఆన్ లైన్ విద్యను అందించడానికి తక్షణం, ప్రత్యేక పథకాల రూపకల్పన, అమలు జరగాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 

కోవిడ్ సంక్షోభ సమయంలో దేశంలో అందరికంటే ముందుగా ఏప్రిల్ లోనే ఆన్ లైన్ క్లాసుల ద్వారా డిగ్రీ, పి.జి విద్యార్ధులకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఆన్ లైన్ తరగతులు ప్రారంభించిందని గవర్నర్ అభినందించారు. 

ఎన్ ఐ టి, వరంగల్ అనేక మంది నైపుణ్యాలు కలవారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నదన్న గవర్నర్ తన సెక్రటరి ఐఎఎస్ అధికారి కె. సురేంద్ర మోహన్ కూడా ఎన్ఐటి పూర్వ విద్యార్ధి అని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో ఎన్ఐటి, వరంగల్, డైరెక్టర్ ప్రొ. ఎన్.వి. రమణారావు, రిజిస్ట్రార్ ప్రొ. ఎస్. గోవర్ధన్ రావు, వెబినార్ కన్వినర్లు ప్రొ. కోలా ఆనంద కిశోర్, డా. హీరా లాల్ తో పాటు దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు