తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు : ప్రధాని మోడీ

ఆదివారం, 1 అక్టోబరు 2023 (16:50 IST)
తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణాలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఆయన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోలుకుంటున్నారని, ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వమే ఏర్పాడుతుందని చెప్పారు. తెలంగాణాలో అవినీతి రహిత పాలన కావాలన్నారు. ప్రజలు పారదర్శక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. 
 
ప్రధాని పాలమూరు పర్యటన సందర్భంగా రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అమిస్తాన్ పూర్ శివారులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. దేశంలో పండుగల సీజన్ మొదలైందని అన్నారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందుతారని అన్నారు. తెలంగాణలో నేడు వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
 
తెలంగాణకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. ఆదివాసీ దేవతలైన సమ్మక్క-సారక్క పేరిట ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, అందుకోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలో నిర్మించే ఐదు టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించామని ప్రధాని మోడీ తెలిపారు. ఈ టెక్స్ టైల్ పార్క్ హన్మకొండలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.
 
అంతేకాదు, కరోనా సంక్షోభ సమయంలో పసుపు విలువ ఏంటో అందరికీ తెలిసిందని, తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు సాగుదారులకు విస్తృత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. 
 
ప్రధాని మోడీ ప్రారంభించిన పనుల్లో... వరంగల్ - ఖమ్మం - విజయవాడ హైవే పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం - హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ప్రారంభం. రూ.2457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట - ఖమ్మం హైవేకు శ్రీకారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భవనాల ప్రారంభోత్సవం. జక్లేర్ - కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రారంభం, కాచిగూడ - రాయచూర్ - కాచిగూడ డెమో రైలు ప్రారంభం, హాసన్ - చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకింత వంటి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు