షర్మిలను పల్లెత్తు మాట అనొద్దు.. ట్రోల్ చేయొద్దు... తెరాస ఆదేశాలు

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని స్థాపించనున్న వైఎస్. షర్మిలను పల్లెత్తు మాట అనొద్దని తెరాస శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కార్యాలయమైన ప్రగతి భవన్ ఆదేశాలు జారీచేసింది. తాజా ఆదేశాలతో తెరాస సోషల్ మీడియా బృందం అప్రమత్తమైంది. 
 
షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తొలగిస్తున్నారు. పార్టీ ఏర్పాటు వార్తల నేపథ్యంలో.. 'అన్న అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లి జగన్‌ను ప్రశ్నించాలి' అంటూ ఆమెపై తెరాస నేతలు సెటైర్లు వేశారు. 
 
తెలంగాణలో ఏం పని చెల్లెమ్మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెప్పుల దండలు వేసిన షర్మిల ఫ్లెక్సీలను సైతం వైరల్ చేశారు. అయితే పార్టీ పెద్దల ఆదేశంతో షర్మిలపై పెట్టిన వ్యతిరేక పోస్టులను, ఫోటోలను తొలగిస్తున్నారు.
 
షర్మిల నిర్ణయం వెనక ఎవరున్నారన్న దానిపై ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. తెరాస తాజా చర్యలతో ఆ చర్చలకు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె పార్టీ ఏర్పాటులో బీజేపీ, తెరాస, వైసీపీ పేర్లు తెరమీదకు వస్తుండగా.. తెరాస అధినాయకత్వం తాజా ఆదేశాలు కొత్త చర్చకు ఊతమిస్తున్నాయి. 
 
కాగా, తెలంగాణా రాష్ట్రంలో అధికార తెరాసతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకే బీజేపీ అధినాయకత్వం షర్మిలను రంగంలోకి దించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న వైఎస్ అభిమాన ఓట్లను చీల్చడం ద్వారా తాను లబ్దిపొందాలన్నది బీజేపీ వ్యూహంగా ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు