వరదలో కూలిన ఇండ్ల గణన వెంటనే పూర్తి చేయాలి: మంత్రి కేటీఆర్

శనివారం, 17 అక్టోబరు 2020 (19:52 IST)
రెండు మూడు రోజుల క్రితం హైదరాబాదులో కురిసిన వర్షాల తాకిడికి నగరంలోని కాలనీలు అన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వర్షం నష్టంపై ప్రత్యేక సమీక్ష సమావేశం ఉన్నతాధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ఇటువంటి వరద సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో రేషన్ కిట్లు, దుప్పట్ల పంపిణీని సమీక్షించారు. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అదనపు సిబ్బందిని నియమించుకోవల్సిందిగా అధికారులకు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కూలిన ఇండ్ల వివరాలు, కావలసిన నిత్యావసర అంశాలను పరిశీలించి వాటి వివరాలను త్వరగా తమకు అందించాలని తెలిపారు.
 
ఈ సమావేశంలో పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవిందన్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపతి, రాష్ట్ర ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డీఆర్జీఎస్ రావు, అగ్నిమాపక అధికారులు, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు