చాటింగ్ సందేశాలు చూపిస్తానంటూ మహిళ బ్లాక్ మెయిల్, యువకుడు ఆత్మహత్య

శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:50 IST)
పెద్దపల్లి‌ : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్‌(33) సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎస్సై ఉపేందర్‌రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్‌ ఫొటోగ్రాఫర్‌. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి.

ఈ క్రమంలో రమేశ్‌ నుంచి రమాదేవి రూ. 6 లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్‌ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్‌కాల్స్, చాటింగ్‌ సందేశాలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్‌లో రమేశ్‌పై కేసు పెట్టింది.
 
తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్‌ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్‌ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్‌ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు