"టైగర్ నాగేశ్వర రావు"కు తెలంగాణ హైకోర్టు అభ్యంతరం

గురువారం, 31 ఆగస్టు 2023 (09:39 IST)
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కొత్త చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఇది ఎరుకల సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్ విడుదల చేయడంపై అభ్యంతరం తెలిపింది. 
 
'టైగర్ నాగేశ్వరరావు' సినిమా టీజర్ ఎరుకల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని, ఇది తమ జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, సినిమా ప్రదర్శనకు ధృవీకరణ పత్రం ఇవ్వకుండా నిలువరించాలని కోరుతూ స్టువర్టుపురానికి చెందిన చుక్క పాల్ రాజ్ అనే వ్యక్తి  తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఏ.పృథ్వీరాజ్, ఎస్ కార్తిక్ వాదనలు వినిపించారు.
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. టీజరులో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రాంత ప్రజలను అవమానపర్చేలా ఉందని వ్యాఖ్యానించింది. డబ్బు సంపాదనే పరమావధిగా సినిమాల నిర్మాణం ఉండకూడదని సూచించింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి కదా..? ఈ టీజర్ ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చిత్ర నిర్మాణ సంస్థను హైకోర్టు సూటిగా ప్రశ్నిస్తూ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసు జారీచేసింది.
 
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనరు ఆదేశించింది. సినిమా నిర్మాణంపై అభ్యంతరం ఉంటే చైర్ పర్సన్‌కు ఫిర్యాదు చేసుకొనేందుకు పిటిషనరుకు వెసులుబాటు కల్పిస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీర్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు