కార్తికేయ బెదురులంక 2012 లో దొంగోడే దొరగాడు సరి కొత్త పాట!

గురువారం, 3 ఆగస్టు 2023 (17:58 IST)
Ajay Ghosh, Srikanth Iyengar, Auto Ram Prasad
కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'వెన్నెల్లో ఆడపిల్ల...', 'సొల్లుడా శివ...' పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట 'దొంగోడే దొరగాడే'ను విడుదల చేశారు. 
 
''లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే.. ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్..
అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్..దొరికిందంతా దోచేయ్ రా.. దొంగోడే దొరగాడు.. దొంగోడే దొరగాడు..అంటూ సాగిన ఈ గీతాన్ని సాహితి చాగంటి ఆలపించారు. కిట్టూ విస్సాప్రగడ రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. 
ఓ మతం, ఓ ఆచారం, ఓ సంప్రదాయం అని కాదు... ప్రతి ఊరిలో, ప్రతి చోట మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే గీతమిది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఏం జరుగుతుందో చూపించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. 
 
చిత్ర దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''ఒక ఊరి ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, వాళ్ళకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను ఎలా దోచుకుంటున్నారనేది ఈ పాటలో చూపించాం. కథలో భాగంగా వస్తుంది. ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు వారిలో ఓ ఆలోచన రేకెత్తించే పాట ఇది'' అని చెప్పారు. 
 
చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ''మేం విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. సినిమాపై క్రేజ్ నెలకొంది. విడుదలకు నెల ముందు బిజినెస్ అంతా క్లోజ్ అయ్యింది. మా సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన మణిశర్మ గారికి థాంక్స్. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. గోదావరి నేపథ్యంలో  ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుంది. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం'' అన్నారు.
 
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు