మూవీ దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్న 'మహానటి'

ఆదివారం, 28 అక్టోబరు 2018 (11:09 IST)
"మహానటి" చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. అయితే, తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి దర్శకత్వం వైపు ముందుకుసాగాలని భావిస్తోంది. 
 
'మహానటి' చిత్రం తర్వాత 'పందెంకోడి 2'లో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఇక స్టార్ హీరో విజయ్ సరసన ఆమె చేసిన "సర్కార్" చిత్రం వచ్చే దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇదిలావుంచితే, కీర్తి సురేశ్‌కి, దర్శకత్వంపై ఆసక్తి ఉంది. అందుకే, సెట్లోకి వెళ్లాక కెమెరా ముందు తన పని పూర్తయితే, వెంటనే కెమెరా వెనక్కి వచ్చి దర్శకత్వ విభాగంలోని అంశాలపై అవగాహన పెంచుకుంటూ ఉంటుందట. 
 
ఇక షూటింగు లేని సమయాల్లో తానే సొంతంగా కథలు రాసుకుంటూ వుంటుందట. కథానాయికగా అవకాశాలు తగ్గిన తరువాత మెగాఫోన్ పట్టాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ విధంగా సంసిద్ధమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి కీర్తి సురేశ్ చాలా పెద్ద ప్రయత్నం పైనే వుందన్న మాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు