నితిన్‌, ప్రియా ప్రకాష్ వారియ‌ర్ రొమాన్స్ 'చెక్‌'

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (16:30 IST)
Nitin, Priya prakash, varrior, check
మ‌ల‌యాళం `ఒరు ఆడార్ ల‌వ్‌`లో కంటిచూపుల‌తోనే యువ‌త‌ను క‌ట్టిప‌డేసిన ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో `ల‌వ‌ర్స్డే`గా వ‌చ్చింది. ఇప్పుడు కొత్త‌గా నితి‌న్‌తో `చెక్‌`పెట్ట‌బోతోంది. చెస్ ప్లేయ‌ర్‌గా నితిన్ న‌టిస్తున్నాడు. ఇందులో ఆమె బెడ్‌సీన్‌లో పాల్గొంది. అది తెలియాలంటే చెక్ వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం  `చెక్‌`‌. ఇందులో రకుల్ ప్రీత్సింగ్, ప్రియా ప్రకాష్  వారియర్ నాయిక‌లు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ను  ఇటీవ‌లే విడుదల చేశారు.

అందులో ఏముందంటే, 'రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి?'* - హీరో ముందున్న ప్రశ్న. 'యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి'* - దానికి నితిన్ ఇచ్చిన బదులు. 'చెక్' ట్రైలర్‌లో ఓ సంభాషణ ఇది. ఆ సమాధానంలోని ధైర్యం చాలు... ఉరిశిక్ష పడ్డ ఖైదీగాజైలులో ఉన్న ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఏ విధంగా పోరాడాడు అనేదిచెప్పడానికి! అతడి పోరాటం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 26 వరకు ఎదురుచూడాలి.
 
'యద్భావం తద్భవతి. అణువు నుంచి అనంతం వరకు ఏదీ కర్మను తప్పించుకోలేదు' అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్‌తో 'చెక్' ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత హీరోను జైలులో ఖైదీలా చూపించారు. రెండు నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'వీళ్లకు ఏ సమస్య వచ్చినా కుంగిపోరు. సొల్యూషన్ వెతుకుంటూ ఉంటారు', 'నువ్విక్కడ ఏం చేసినా కొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి', 'ఆదిత్య కేసులో క్షమాబిక్షకు అవకాశం ఉందా? ' డైలాగులు 'చెక్'పై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ నెల 26న సినిమాను విడుదల చేయనున్నారు.
 
చిత్రం గురించి నిర్మాత  వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, "చెస్ నేపథ్యంలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చక్కటి యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రూపొందించారు. ఎమోషన్స్ కూడా ఉంటాయి. తొలుత 19న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే, సీజీ వర్క్స్ పూర్తి కాలేదు. అందుకని, 26న వస్తున్నాం. బుధవారం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్ కొత్త లుక్ బావుందని ప్రశంసలు వస్తున్నాయి.

చెస్ ప్లేయర్ హారిక ద్రోణవల్లి ట్రైలర్ బావుందని ట్వీట్ చేశారు. చెస్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం చాలా ఆసక్తి గాఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు. హీరోలు సాయితేజ్, వరుణ్ తేజ్, హీరోయిన్ కీర్తీసురేష్ తదితరులు ట్రైలర్, అందులో నితిన్ లుక్ పైన ప్రశంసలు కురిపించారు. అందరికీ థాంక్యూ. ముఖ్యంగా సోషల్ మీడియాలో నితిన్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కి అద్భుత స్పందన లభించింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది" అని అన్నారు.
 
సాయిచంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణిమాలిక్, ఛాయా గ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్: వివేక్ అన్నామలై , ఎడిటింగ్: అనల్అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి , నిర్మాత: వి.ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు