తెలంగాణ పూర్వీకులకు నివాళిగా రజాకార్ సినిమా

బుధవారం, 29 నవంబరు 2023 (17:50 IST)
Rajakaar team
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. మంగళవారం ఈ సినిమా నుంచి ‘పోతుగడ్డ మీద...’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి, డైరెక్టర్ యాటా సత్యనారాయణ, అనుష్య త్రిపాఠి, ప్రొడక్షన్ డిజైనర్ తిరుమల తిరుపతి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, కొరియోగ్రాఫర్ స్వర్ణ,లిరిక్ రైటర్ సుద్ధాల అశోక్ తేజ, బాబీ సింహ తదితరులు పాల్గొన్నారు.
 
హీరోయిన్ అనుష్య త్రిపాఠి మాట్లాడుతూ ‘‘‘పోతుగడ్డ మీద..’ సాంగ్ బ్యూటీఫుల్‌గా ఉంది. భీమ్స్ గారు పాటను అద్భుతమైన ట్యూన్‌ని అందించి, గొప్పగా పాడారు. బాబీ సింహగారు ప్రాణం పెట్టి నటించారు. దర్శకుడు యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి సహా టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.
 
సుద్ధాల అశోక్ తేజ మాట్లాడుతూ ‘‘ఈ పాట రాయటానికి ముందు డైరెక్టర్ యాటా సత్యనారాయణ నన్ను పిలిచి మాట్లాడారు. సన్నివేశం గురించి నాకు నెరేట్ చేశారు. ఆయన నెరేషన్‌లోని ఎమోషన్స్ గొప్పగా ఉన్నాయి. ఈ రజాకార్ ఉద్యమంలో మా అమ్మ, నాన్న పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. సుద్దాల హనుమంతు, జానకమ్మ బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. అందువల్లే ఒకే వెర్షన్‌ రాశాను. గాయకుడు, సంగీత నాయకుడిగా భీమ్స్ ఉండటం కూడా నాకు కలిసొచ్చింది. అతను కూడా రజాకార్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చారు. అలాగే హీరో, కొరియోగ్రాఫర్ స్వర్ణ అందరం ఏకాత్మగా పాటను రూపొందించాం. ఇలాంటి సినిమా తీయటానికి డబ్బులు ఉంటేనే సరిపోదు. గట్స్ ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్న గూడూరు నారాయణ రెడ్డిగారికి ఉంది. సినిమా రిలీజ్ కాకుండా హిట్ అయ్యిందనే చెప్పాలి’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ ‘‘రజాకార్’ నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. ప్రతిరోజూ నన్ను ఏడిపిస్తోన్న సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో పాట పాడటం, సంగీతం చేయటం అంటే అమరులైన వీరుల కోసం పాడిన పాట అనే చెప్పాలి. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో వారందరినీ స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చెప్పాలి. మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ఆత్మకు నివాళిగా ఈ సినిమాను నేను చేస్తున్నానని భావిస్తున్నాను. ఈ మూవీకి పని చేసినందుకు గర్వంగా ఉంది. గూడూరు నారాయణరెడ్డి, యాటా సత్యనారాయణ రెడ్డి, అంజి రెడ్డి వంటి వారు అరుదుగా ఉంటారు. సుద్దాల అశోక్ తేజగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సినిమా రీరికార్డింగ్ జరుగుతుంది. రీల్ టు రీల్ చూసి కన్నీళ్లు పెట్టుకునేంత ఎమోషనల్‌గా సినిమా ఉంది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, వర్క్ చేసిన సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.
 
బాబీ సింహ మాట్లాడుతూ ‘‘భీమ్స్ గారి సంగీతం, సుద్దాల అశోక్ తేజగారు అందించిన సాహిత్యంలో తెలియని ఎమోషన్ ఉంది. సినిమా షూటింగ్ సమయంలోనూ మేం అంతే రేంజ్‌లో ఎమోషనల్‌గా ఉన్నాం. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సత్యనారాయణగారి దగ్గర మన హిస్టరీ ఏంటి?అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. మనవాళ్లు ఇంత కష్టపడ్డారా? అనిపించింది అన్నారు.
 
డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘సుద్దాల హనుమంతు, జానకమ్మ వంటి పోరాట యోధుల ఉగ్గు పాటలతో పెరిగాం. సినిమా తీస్తున్నంతసేపు కళ్లలో ఎమోషన్, గుండెల్లో ఆవేశం వరదలై పారుతుంది. ఈరోజు స్టేజ్‌పై సుద్ధాల అశోక్ తేజగారు, భీమ్స్ గారు కావాలనే ఎమోషనల్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంత ఆవేదన నిండి ఉంది. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు