తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. ఏపీలో వడగాల్పులు.. వాతావరణ శాఖ హెచ్చరిక

బుధవారం, 12 ఏప్రియల్ 2023 (12:17 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు ప్రజలను బెంబేలెత్తింప జేస్తున్నాయి. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక వేడిమి కారణంగా, వడదెబ్బ ముప్పు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అయితేనే బయటికి రావాలని సూచించింది.
 
ఏప్రిల్ 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనేక చోట గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటుతాయని తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలంగాణలో మూడ్రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వివరించింది. 
 
అదేవిధంగా ఏపీలోనూ రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలకు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  వడగాల్పులు వీచే ప్రమాదముందని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు