షర్మిలక్కా, అది సాధ్యమేనా?

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:26 IST)
వైఎస్ఆర్ కుమార్తె వై.ఎస్. షర్మిల పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. తెలంగాణాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే పార్టీ పెడుతున్నట్లు షర్మిల స్వయంగా చెప్పారు. నేరుగా కొంతమంది నేతలతోను, అలాగే విద్యార్థులతోను ముఖాముఖి మాట్లాడిన షర్మిళ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
అన్న జగన్మోహన్ రెడ్డి వద్దన్నా సరే పార్టీ పెట్టి మరీ జనంలోకి వెళ్ళడం మాత్రం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చే. అయితే తెలంగాణాలో పార్టీ పెట్టడంతో వైసిపి నేతలు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎంతో అభివృద్థి చేశారని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం అభివృద్థి చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకొచ్చారు షర్మిళ.
 
రాజకీయంగా షర్మిల వ్యాఖ్యలపై పెద్దగా టిఆర్ఎస్ స్పందించలేదు. కానీ ఈరోజు విద్యార్థులతో కలిసి ముఖాముఖి ఆమె మాట్లాడారు. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ వచ్చిందా.. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో మౌళిక వసతులు ఉన్నాయా అంటూ ప్రశ్నలు వేశారు షర్మిళ.
 
అయితే ఇదంతా బాగానే ఉన్నా షర్మిళ పార్టీ తెలంగాణాలో ఎంతమాత్రం జనం ఆదరిస్తారన్నది అనుమానమే. ఇదే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్ర సమితిని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతోంది.
 
గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఎలాగైనా టిఆర్ఎస్‌ను ఓడించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారి వల్ల మాత్రం కాలేదు. అలాంటిది షర్మిల ఇప్పుడొచ్చి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వారి సమస్యలను నేను తీరుస్తా అంటూ చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతమున్న అధికార, ప్రతిపక్ష పార్టీలను కాదని షర్మిల పార్టీ నడపడం అస్సలు సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మలక్క పార్టీ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు