శ్రీకాళహస్తిలో కరోనా రోగికి దేవదాయశాఖ గది కేటాయింపు

శనివారం, 30 మే 2020 (14:33 IST)
అసలే కరోనా విజృంభిస్తోంది. లాక్ డౌన్‌ను జనం పెద్దగా పట్టించుకోకుండా రోడ్లపైన తిరిగేస్తున్నారు. సామాజిక దూరాన్ని అస్సలు మర్చిపోయారు. సగానికిపైగా జనం మాస్కులు ధరించడం లేదు. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని సామాజికమాధ్యమాల్లోను, ప్రసార మాధ్యమాల్లోను వస్తున్నా సరే జనం మాత్రం అదొక సాధారణ జ్వరంగా తీసుకుని ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. 
 
అయితే విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌లకు కూడా విమానాలు వచ్చాయి. అయితే ఇందులో కువైట్ నుంచి వచ్చిన వారే ఎక్కువమంది భారతీయులు ఉన్నారు. వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లకు పంపిస్తున్నారు. కొంతమందిని ప్రభుత్వ క్వారంటైన్‌లకు పంపిస్తే మరికొంతమంది మాత్రం పెయిడ్ క్వారంటైన్‌లకు వెళుతున్నారు.
 
ఇలా క్వారంటైన్లలో వెళ్ళిన వారు కొంతమందికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. కానీ కువైట్ నుంచి ఈమధ్య వచ్చిన ఒక వ్యక్తిని దేవాదాయశాఖ అధికారుల రెకమెండేషన్‌తో ఏకంగా శ్రీకాళహస్తిలో వసతి గృహాన్ని ఇచ్చారు. అతనికి పరీక్షలు చేశారు. ఈరోజు అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దేవాదాయశాఖకు చెందిన గదులు, అది కూడా శ్రీకాళహస్తి ఆలయం పరిసరాల్లో కరోనా వ్యక్తికి గదులు కేటాయించడంపై  సర్వత్రా విమర్సలు వస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హుటాహుటిన కోవిడ్ -19 ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. అతను ఉన్న గదిలో రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. గదిని కేటాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్థమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు