మార్చి 4న తిరుపతిలో అమిత్ షా: దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:53 IST)
వచ్చే మార్చి 4వ తేదీన తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 29వ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి (Southern Zonal Council) సమావేశం జరగనుంది. ఈ సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వనుండగా ఈసమావేశంలో తెలంగాణా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు సభ్య రాష్ట్రాలుగా పాల్గోనుండగా కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీప్ లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గోనున్నాయి.
 
ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టనెంట్ గవర్నర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు, ఇతర ముఖ్య అధికారులు ఈసదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సుమారు 90 నుండి 100 మంది వరకూ ప్రముఖులు,అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వనున్న నేపధ్యంలో సమావేశం నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా అతిధులకు ఆహ్వానం, రవాణా, వసతి, బందోబస్తు వంటి ఏర్పాట్లన్నీ పటిష్టవంతంగా నిర్వహించాల్సి ఉంది.
 
 
ఈ నేపధ్యంలో సదరన్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా మార్చి 4వతేదీన తిరుపతిలో జరిగే ఈసదరన్ కౌన్సిల్ సమావేశం ప్రాంతాన్ని వెంటనే ఖరారు చేసి హాజరుకానున్న అతిధులందరికీ తగిన వసతి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రొటోకాల్ విభాగం అధికారులతోపాటు చిత్తూరు జిల్లా కలక్టర్, ఎస్పి, తిరుపతి మున్సిపల్ కమీషనర్, తిరుపతి అర్బన్ ఎస్పిలను సిఎస్ ఆదేశించారు.
 
అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనానికి వచ్చే అతిధులకు తగిన దర్శన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సదరన్ కౌన్సిల్ సమావేశం జరిగే తిరుపతి నగరంలోని ప్రధాన వేదిక హాల్లో ప్రత్యేక బ్యాక్ డ్రాప్ ఏర్పాటు, ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక ప్లెక్సీ బ్యానర్లు ఏర్పాట్లు, వేదిక సుందరీకరణ తోపాటు నగర సుందరీకరణ వంటి చర్యల తీసుకోవాలని ప్రొటోకాల్, మున్సిపల్ తదితర శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.
 సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మొత్తం కార్యక్రమం అంతటినీ ఆడియో, వీడియో చిత్రీకరణ చేసి సిడి, పెన్ డ్రైవ్ ల రూపంలో సిద్ధం చేసి తుది ప్రొసీడింగ్స్ రూపొందించేందుకు వీలుగా జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ అధికారులకు అందించాలని సమాచారశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు.
 
అలాగే ఈసమావేశానికి సంబంధించి పొటోలు, వీడియోలు చిత్రీకరించి ఎప్పటికప్పుడు మీడియాకు విడుదల చేయడంతోపాటు కేంద్ర, రాష్ట్ర స్థాయిల నుండి వచ్చే మీడియాను సమన్వయం చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఐటి శాఖ అధికారులు ఈసమావేశ వేదిక వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం తోపాటు వైఫై, ల్యాన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచడం, తగినన్ని లాప్ ట్యాప్లు,పెద్దసైజు ఎల్ఇడి తెరలు వంటి సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రవాణా శాఖ అధికారులు తగినన్ని వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశానికి వచ్చే అతిధులు, ప్రతినిధులందరికీ తగినన్నిటెస్టింగ్ కిట్లు, మాస్క్లు, శానిటజర్లు వంటివి అందుబాటులో ఉంచాలని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు.
 
ఈ మొత్తం ఏర్పాట్లన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రొటోకాల్ విభాగం నుండి ఒక లైజను అధికారిని నియమించాలని అలాగే జిల్లా స్థాయిలో చిత్తూర్ జిల్లా కలక్టర్ అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు. అంతేగాక సంబంధిత శాఖల అధికారులు కూడా వారి వారి శాఖలకు సంబంధించి ఒక లైజన్ అధికారిని నియమించి రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ అధికారులను ఆదేశించారు.
 
 
ఈ సమావేశంలో రాష్ట్ర పనర్వ్వస్థీకరణ కమిటీ(ఎస్ఆర్సి) కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్, టిఆర్అండ్బి, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు యం.టి కృష్ణ బాబు, కుమార్ విశ్వజిత్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఐటి, ప్రోటోకాల్, సమాచారశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొనగా తిరుపతి నుండి చిత్తూర్ జిల్లా కలెక్టర్, ఎస్పి, తిరుపతి అర్బన్ ఎస్పి, తిరుపతి మున్సిపల్ కమీషనర్, టిటిడి అధికారులు వీడియో లింక్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు