ఆంధ్రాలో 15 వేల మార్కును దాటిన కరోనా పాజిటివ్ కేసులు

బుధవారం, 1 జులై 2020 (13:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలకు చేరాయి. గత 24 గంటల్లో 28,239 శాంపిళ్లను పరీక్షించగా మరో 657 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 611 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 342 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,813 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 7,033 మంది ఏపీ వాసులకు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 193కి చేరింది. 
 
అలాగే, దేశంలో కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 18,653 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేసమయంలో 507 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,85,493కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 17,400కి పెరిగింది. 2,20,114 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,47,979 మంది కోలుకున్నారు.
 
కాగా, సోమవారం వరకు దేశంలో మొత్తం 86,26,585 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మంగళవారం ఒక్కరోజులో 2,17,931 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు