వైఎస్ఆర్.. ఈ కడప బిడ్డ పులివెందుల పులి... నేను ఆయన బిడ్డనే : వైఎస్ షర్మిల

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (18:01 IST)
ఏపీలోని వైకాపా నేతలకు ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ వారసురాలు వైఎస్ షర్మిల నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నారు. ఆమె ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తుంటే వైకాపా నేతలు సమాధానుల చెప్పలేక ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సాక్షాత్ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకొకరితో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. అయితే, షర్మిల మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైకాపా నేతలకు దిమ్మతిరిగిపోయేలా ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
"ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి... ఈ కడప బిడ్డ పులివెందుల పులి. తెల్లని పంచే కట్టు... మొహం నిండా చిరునవ్వు. ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించిన నాయకుడు. ఇది వైఎస్ఆర్ మార్క్  రాజకీయం. ఆయన పథకాలే ఒక మార్క్. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించలేనీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన వారసులు ఎలా అవుతారు..? జగన్ అన్నకి నేను వ్యతిరేకి కాదు.. కానీ జగనన్న అప్పటి మనిషి కాదు. రోజుకో జోకర్‌ను తెచ్చి నాపై బురద చల్లుతున్నారు. నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాను. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నాను. ఎవరెంత నిందలు వేసినా... ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రత్యేక హోదా వచ్చే వరకు.. ఇక్కడ నుంచి కదలను.. పోలవరం వచ్చే వరకు కదలను గుర్తుపెట్టుకోండి". 
 
"అనంతపురం జిల్లా అంటే వైఎస్ఆర్‌కి ప్రియమైన జిల్లా. ఈ జిల్లా కరువు జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండో స్థానం. ఈ ప్రజలను బ్రతికించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అని వైఎస్ఆర్‌ నమ్మాడు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. YSR  హయాంలో ఇక్కడ 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట వేసేవారు. 'ప్రాజెక్టు అనంత' సృష్టికర్త రఘువీరా రెడ్డి గారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి 'ప్రాజెక్టు అనంత' గురించి పట్టించుకోలేదు. బీజేపీ కి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్టుకి తూట్లు పొడిచారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే..6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. 90 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ఆర్ పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులు జగనన్న పూర్తి చేయలేక పోయాడు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేసి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న హామీని మరిచాడు. ఇది నా పుట్టిల్లు ..ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి .. ఇక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నారు కాబట్టి ఏపీ రాజకీయాల్లోకి వచ్చాను". 
 
"వైఎస్ఆర్ కట్టిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహణ విషయంలో పట్టించుకోక ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నాడు. జగన్ అన్నకు మరమ్మత్తులు చేయించడానికి మనసు రావడం లేదు.. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే. వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకోని మీరు ఆయన వారసులు ఎలా అవుతారో చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరవండి. లేదంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని వైఎస్ షర్మిల హెచ్చరించారు". 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు