అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది?

గురువారం, 2 జులై 2020 (08:56 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మరింతగా క్షీణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈయనను ప్రస్తుతం ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టు చేశారు. పైగా, ఆయనకు పైల్స్ ఆపరేషన్ చేసివున్నారు. ఈ ఆపరేషన్ వికటించడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, విజయవాడ సబ్ జైలుకు తరిలించారు. 
 
అంతకుముందు ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు కూడా ఆయనను ఆసుపత్రిలోనే మూడు రోజుల పాటు విచారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆయనను విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
 
మరోవైపు తనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఆసుపత్రి నుంచి విడుదల చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కొలనోస్కోపీ పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని లేఖలో తెలిపారు. కరోనా పరీక్షలు చేయకుండా అధికారులు జైల్లోకి అనుమతించరని... అందువల్ల తనకు కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని కోరారు.
 
మరోవైపు, అచ్చెన్నాయుడు ఆసుపత్రి నుంచి విడుదలవుతున్నారనే సమాచారంతో... ఆసుపత్రి వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కోలాహలం నెలకొంది. వారందరి మధ్య నుంచే అచ్చెన్నను జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు