అయ్యా చంద్రబాబు గారు, ఇక అక్కడ పోటీ చేయడం అవసరమా?

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (21:20 IST)
తెలంగాణాను డెవలప్ చేసింది మేమే. హైటెక్ సిటీ మేము నిర్మించిందే. యువ పారిశ్రామికవేత్తలు, కొత్త పరిశ్రమలను మేమే ఏర్పాటు చేశాం. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాం. టిడిపిపై నమ్మకం పెట్టండి.. మా అభ్యర్థులను గెలిపించండి.. ఇదంతా ఎవరో కాదు చెప్పింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. అది కూడా ఎలా చెప్పారంటే ట్విట్టర్ వేదికగా.
 
తెలంగాణా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ప్రధాన ఎన్నికలను మరిపించాయి. అసలు బిజెపి, టిఆర్ఎస్‌ల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ఇదే చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి కూడా ఎన్నికల్లో పోటీకి నిలిచింది. మొత్తం 150 డివిజన్లకు గాను 100 డివిజన్లలో టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. కనీసం డిపాజిట్లు రాకుండా పోయాయి. 
 
అసలు పార్టీ అధినేత ప్రచారానికి రాకపోవడంతో.. సోషల్ మీడియాలో సందేశాలు పంపడం.. తెలంగాణా రాష్ట్రంలోని టిడిపి నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదట. దీంతో ప్రస్తుతం వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో టిఆర్ఎస్ తరువాత ఎం.ఐ.ఎం. ఆ తరువాత టిడిపికి జనం పట్టం కట్టారు.
 
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ప్రచారానికి రాకపోవడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందట. అసలు ప్రచారానికి రాకపోవడంతోనే జనం కనీసం ఓట్లు కూడా వేయలేదని ఆ పార్టీ అభ్యర్థులు భావిస్తూ బహిరంగంగా చంద్రబాబును విమర్సలు చేస్తున్నారట. కానీ ఇప్పుడు టిడిపి తెలంగాణలో వుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం. అసలిక్కడ పోటీ చేయడం అవసరమా అంటూ ప్రశ్నలు కూడా వేసేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు