జగన్ బీసీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలనుకుంటున్నారా?: బాబు, కళా

శనివారం, 4 జులై 2020 (10:42 IST)
జగన్ బీసీలను రాష్ర్టం నుంచి వెళ్లగొట్టాలనుకుంటున్నారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు, సీనియర్ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

"మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమంగా హత్యకేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేత భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్రకు ఎలాంటి సంబందం లేకపోయినా కేసు పెట్టడం దుర్మార్గపు చర్య. కొల్లు రవీంద్ర సౌమ్యుడు, మృదుస్వభావి, నిరంతరం ప్రజా క్షేమం కోసం పాటుపడేవ్యక్తి.

మచిలీపట్నం నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ది, ప్రజలకు ఆయన చేసిన సేవల గురించి ఆ ప్రజలే  చెప్తారు. అలాంటి వ్యక్తిని హంతకునిగా చిత్రీకరించాలనుకోవటం దారుణం. పాతకక్షల నేపద్యంలో హత్య జరిగితే దాన్ని రవీంద్రకు ఆపాదిస్తారా?" అని ప్రశ్నించారు.
 
"జగన్ ప్రభుత్వ పాలన వైపల్యాలను, జగన్ అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. బీసీలను రాష్ర్టం నుంచి వెళ్లగొట్టే కుట్రచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, నమల రామకృష్ణ, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర వంటి బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

ఆర్ధిక నేరస్తులకు ఆంధ్రప్రదేశ్ ని అడ్డాగా మార్చిఅంతర్జాతీయ ఆర్ధిక నేరస్థుడుగా రాష్ట్రం పరువుతీసిన నాయకుడు నేడు అందరిని అవినీతిపరులుగా, ఆర్ధిక నేరస్తులుగా చిత్రించాలని అక్రమ కేసులతో అణచి వేస్తున్నారు" అని విమర్శించారు."
 
ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ద్వంసం చేస్తోంది. వ్యక్తి గత స్వార్ధంతో,అక్కసుతో, అధికార దాహంతో వ్యవస్థలను కుప్పకూల్చడానికి వెరవని సంస్కృతి వైకాపా పాలనలో వేళ్లూనుకున్నది. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అధికారమే వైకాపా పరమావధి అనే తత్వం తీవ్రరూపం దాల్చింది.

అడ్డదారిలో అరాచకం సృష్టిస్తూ ప్రత్యర్ధులపై ప్రతీకారం తీర్చుకొనేందుకు తప్పుడు కేసులు బనాయిస్తు టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేసిన  ప్రత్యేక చట్టాలు నిర్భయ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి నిరోధక చట్టం, దిశా చట్టం, అన్నింటినీ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

జగన్ పాలనలో ప్రజలవలన, ప్రజల చేత, ప్రజలకొరకు అంటున్న ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంకుశ విధానాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు వైకాపా ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై, ఇష్టాయిష్టాలపై ఆదారపడి జీవించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.

భావ ప్రకటనా స్వేచ్చకు ఇనుప సంకెళ్లు వేసే ఖాకీల క్రౌర్యం రాజ్యమేలుతోంది. ఎవరు నోరుతెరిచినా వారికి మూడి నట్లే అన్నవిధంగా ఫాసిస్టు పాలన సాగిస్తున్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తమ విధులు వారు నిర్వహిస్తుంటే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధమైన అసహ్యపు వికృత రూపాన్ని ప్రదర్శించలేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించిన వారిపై  ఈ క్రూరత్వం ఏమిటి? ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించేవారు, వారు వుండవద్దు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? రాజ్యాంగం ఎందుకు? వైకాపా ప్రభుత్వం మానవ హక్కులను యధేచ్చగా ఉల్లంఘిస్తోంది.  అధికారం శాశ్వతం కాదు అన్న సంగతి జగన్, వైసీపీ నేతలు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి" అని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు