పిడుగుపాటు నుంచి తెరాస ఎమ్మెల్యే జస్ట్ ఎస్కేప్... ఏపీలో ఐదుగురు మృతి

గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:23 IST)
ఒకవైపు దేశం యావత్తూ కరోనా వైరస్‌తో వణికిపోతోంది. అయితే, గురువారం ఉన్నట్టుండి దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పాటు... పిడుగులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ఈ వర్షం భారీగా ఉండగా, మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ.. కరోనా వైరస్ భయం మరింతగా ఎక్కువైంది. చల్లనివాతావరణంలో ఈ వైరస్ మరింతగా విజృంభింస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. 
 
అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన దేవకొండ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు పిడుగుపాటును నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్‌హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యేతో ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో గురు, శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
 
ఇదిలావుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గురువారం కురిసిన‌ ఆకాల వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి ఐదుగురు మృతిచెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా బోగోలు మండలం భాస్కరగిరివారి కండ్రిలో పిడుగుప‌డి పెంచలరెడ్డి అనే 65 ఏళ్ళ వ్యక్తి మృతిచెందాడు. అల్లూరు మండలం పడమర గోగులపల్లిలో సుబ్బారావు అనే 54 ఏండ్ల‌ వ్యక్తి పిడుగుపాటుకు బ‌ల‌య్యాడు. ఇక‌, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి చేతికి వచ్చిన పంటలు కూడా నేలపాల‌య్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు