ఈతకొలనులో జలకాలాడుతున్న గంటా.. మనవడితో నీలిరంగు ఆటలు

శనివారం, 4 మే 2019 (10:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి తగ్గింది. ఓటరు ఇచ్చిన తీర్పు ఈవీఎం యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఈనెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, మండుటెండలో హోరాహోరీగా ప్రచారం చేసిన నేతలు ఇపుడు విహారయాత్రలకు వెళుతున్నారు. కొందరు ఇప్పటికే వెళ్లి సేదతీరుతుంటే.. మరికొందరు ఇపుడు బయలుదేరుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారం ముగియగానే తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆయన ఓ విలాసవంతమైన హోటల్‌లో బస చేస్తున్నారు. 
 
హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ, తన మనవడితో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపాక నా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చాను. మనవడితో కలిసి నీలిరంగు నీటిలో ఆడుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ టూర్ కోసం ఎక్కడికి వెళ్లారన్న విషయమై గంటా స్పష్టత ఇవ్వలేదు. కానీ అది ఓ సముద్రతీర విహార కేంద్రమని ఫోటోలద్వారా తెలుస్తోంది.
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో స్విస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈయన మళ్లీ శనివారం లండన్ పర్యటనకు వెళ్లాల్సివుండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు