రజినీకాంత్‌ను పల్లెత్తు మాట అనలేదు.. : ఏపీ మంత్రి రోజా

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (16:13 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను తాను పల్లెత్తు మాట అనలేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించానని చెప్పారు. ముఖ్యంగా, చంద్రబాబు గెలిపించాలని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే ఖండించానని వివరణ ఇచ్చారు. పైగా, చంద్రబాబు వంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజినీకాంత్ ఇమేజ్ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. 
 
ఇటీవల తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో మంత్రి రోజా కూడా ఉన్నారు. అయితే, సోమవారం ఆమె మాట్లాడుతూ రజినీకాంత్‌ను తాను విమర్శించలేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి చంద్రబాబు తీసుకొస్తారని ఆయన చెప్పడాన్ని మాత్రమే తాను ఖండించానని అన్నారు. 
 
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అన్నానని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజినీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇల్లు లేవని... హైదరాబాద్ నుంచి వచ్చి వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఎమ్మెల్యేపై నారా లోకేశ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ ఊగిపోతున్నారని ఎద్దేవా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు