టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం.. హీరో నాని ఇంట్లో కూడా సోదాలు

బుధవారం, 20 నవంబరు 2019 (14:09 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటితో పాటు.. ఆయన కుటుంబానికి చెందిన రామానాయుడు స్టూడియోలో బుధవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 
 
రామానాయుడు స్టూడియోతోపాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
 
ఇటీవలకాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.
 
కాగా, గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. 
 
మరోవైపు, టాలీవుడ్ హీరో నానికి చెందిన గృహాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంది. ఇక్కడ ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు