చంద్రబాబును ఎందుకు కొట్టారు?: మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

శనివారం, 1 ఆగస్టు 2020 (17:49 IST)
టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేసిన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ... "రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్రతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టం నెరవేరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతం ఎక్కువ, ఇంకో ప్రాంతం తక్కువ అనే భావన ప్రభుత్వాలకు ఉండకూడదు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తే మిగిలిన ప్రాంతాల్లో అసంతృప్తి పెరుగుతుంది. ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదనే  ధోరణిలో మళ్ళీ రాష్ట్ర విభజనకు బీజం పడే అవకాశం ఉంటుంది. చంద్రబాబును ఎవరూ కలలు కనాలని కోరలేదు.

కలలు కని, శంకుస్థాపన చేసి, గ్రాఫిక్స్ చూపించి వెళ్ళిపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చంద్రబాబు కలలు కన్నవన్నీ నెరవేర్చాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోవాలి. అమరావతిలో ఖర్చుపెట్టే దానిలో 10% వైజాగ్ లో పెడితే చెన్నై, బెంగళూరు, ముంబై,  కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉన్న పరిస్థితులను కల్పించుకోవచ్చు.

రాష్ట్రంలో ఒక నగరాన్ని నిర్మించడం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఆర్ధిక పరిస్థితి లేదు. చంద్రబాబు కొట్టే డప్పాలు, చూపించే గ్రాఫిక్స్ కు దూరంగా ఉంటూ వాస్తవాలను తెలుసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలవడం సంతోషం. తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలును రాజధానిగా ఇచ్చారు. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్కు తరలిపోయింది. నేడు కర్నూలు ప్రజలు చాలా చిన్న కోరిక కోరారు.

కనీసం హైకోర్టు అయినా మా ప్రాంతంలో పెట్టమని అడిగారు. చంద్రబాబు గుడ్డెద్దులా, చెవిటి వాడులా కర్నూలు ప్రజలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికే అన్నింటినీ పరిమితం చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉన్న 52 సీట్లలో బావ,  బావమరుదిని తప్పించి మిగతా అన్ని సీట్లలో చిత్తుగా ఓడించారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజలు అమరావతిలోనే రాజధానిని కోరుకుంటున్నారని అంటాడు.

అలాంటప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా చంద్రబాబును మొహం పగిలేట్టు ఎందుకు కొట్టారు? తప్పిడి మూతితో జూమ్ కెమెరా పెట్టుకొని ఇంటి దగ్గర నుండి సొల్లు చెప్పుకోవాల్సిన పరిస్థితికి ఎందుకు తెచ్చారు. పిచ్చి తుగ్లక్ పనులు చేయడం వల్ల కాదా? బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ఎన్టీఆర్ హయాం నుండి టిడిపికి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఇదే ప్రాంతంలో జగన్ ప్రభంజనం ఎందుకు వచ్చింది?

ఉత్తరాంధ్రలో వైసీపీకి టిడిపి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఉత్తరాంధ్రను చంద్రబాబు పట్టించుకోలేదని భావన ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టినప్పటికీ చంద్రబాబుకు సీట్లు రాకపోవడానికి కారణం ఎటువంటి నిర్మాణాలు చేయకపోవడమే.

ఒకసారి అమరావతికి,  ఇంకోసారి పోలవరానికి బస్సులు పెట్టి ప్రజలను తీసుకెళ్లి అక్కడేదో పగల తీసినట్టుగా దొంగ మాటలు చెప్పారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అబద్ధాలకు పరిమితమయ్యాడు. మళ్లీ సీఎం అయితే ఇలాగే సొల్లుకబుర్లు చెబుతాడని, మిగిలిన ప్రాంతాల మధ్య ద్వేషాలు వచ్చే పరిస్థితి ఉంటుందని ప్రజలు తెలుసుకుని చంద్రబాబును మూతి పగిలేలా కొట్టారు.

గవర్నర్ ఆమోదముద్ర తర్వాత చంద్రబాబు జూమ్ లో మాట్లాడింది రికార్డుల్లో నిలిచిపోద్దంట. ప్రపంచంలో మిగిలిపోద్దంట. రోజూ చెప్పే వెధవ సోల్లె చెప్పాడు. కొత్తగా చెప్పింది లేదు. చంద్రబాబుకు ఆరోగ్యం బాగుంటే ఇంకో పదేళ్లు బతుకుతాడంట. బతకడం వల్ల చంద్రబాబుకు, ఆయన పార్టీకి కూడా ఉపయోగం లేదు. టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చే పరిస్థితి చంద్రబాబుకు, లోకేష్ లకు కూడా లేదు.

మూడు రాజధానుల ప్రకటన వచ్చిన తర్వాత మేమంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ముక్కు, మొహం లేని వెదవలంతా టీవీల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం వికేంద్రీకరణకు అనుకూలంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసింది. అమరావతిలోని రాజధాని ఉండాలనుకుంటే టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లొచ్చు కదా!

అమరావతి పేరుతో ఎన్నికలకు వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలంతా మళ్లీ గెలిస్తే మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కుప్పంలో కూడా చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోతే ఆయన మా దారిలోకి రావచ్చు. చంద్రబాబుకు అమరావతి రైతులపై ప్రేమ ఉంటే, వారిని ముంచకూడదనుకుంటే ఎన్నికలకు వెళ్లాలి. తెలంగాణ కోసం కెసిఆర్ ఎంపీ పదవికి రెండుసార్లు రాజీనామా చేశారు.

వైసిపి పెట్టినప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము, సత్తా, మగతనం చంద్రబాబుకు లేదు. ఆయన వట్టి చవట దద్దమ్మ. జీవితంలో ఒక్కసారైనా మగాడిలా ఉపఎన్నికలకు వెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి రైతుల భవిష్యత్తు కోసం చంద్రబాబు నిలబడాలి. రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదనే పేరు చంద్రబాబుకు చచ్చేలోగానైనా వస్తుంది. చంద్రబాబు ముందు సొల్లు,  సోది కబుర్లు ఆపి నేరుగా ఎన్నికలకు రావాలి.

రాజధానా, రాజధానులా అనే విషయంలో చంద్రబాబు ఎన్నికలకు వెళితే మేము ఆయన దారిలోకైనా, లేక ఆయన మా దారిలోకైనా రావచ్చు. టిడిపి అధ్యక్షుడిగా కొనసాగాలన్నా, 33 వేల ఎకరాలు తీసుకొని ముంచేసిన రైతులకు చేదోడువాదోడుగా నిలబడాలన్నా ఉప ఎన్నికల గురించి ఆలోచించాలి. రోజూ సొల్లు కబుర్లు చెబుతున్నావని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉప ఎన్నికలకు వెళ్లకుండా చెప్పేదంతా సొల్లేనని మళ్ళీ నిరూపించుకోవద్దు" అని విమర్శలు గుప్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు