పోలీసులూ.. తస్మాత్ జాగ్రత్త... 2 నెలల తర్వాత మరోలా ఉంటుంది : నారా లోకేశ్

ఠాగూర్

మంగళవారం, 26 మార్చి 2024 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రభుత్వానికి అంటకాగుతున్న, అధికార పార్టీ నేతలకు అడుగులు మడుగులు ఒత్తుతున్న కానిస్టేబుల్ నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ హెచ్చరిక చేశారు. మరో రెండు నెలల్లో ప్రభుత్వం మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో రెండు నెలల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
 
కాకినాడలో శివాలయంలో పూజారులపై వైకాపా మాజీ కార్పొరేటర్ చంద్రరావు దాడి చేసి, కాలితో తన్ని, బూతులు తిట్టిన అంశం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ, ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు. వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో అర్చకులపై దాడి అమానుష చర్యగా పేర్కొన్నారు. 
 
'కాకినాడ శివాలయంలో పూజ సరిగా చేయలేదని గర్భగుడిలో అర్చకులపై వైకాపా నేత సిరియాల చంద్రరావు దాడి చేశాడు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా? పూజారులపై దాడి చేసిన వైకాపా నేతను తక్షణమే అరెస్టు చేయాలి. మరో రెండు నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోంది. ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నా' అని లోకేశ్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు