గుంటూరులో ఘరానా దోపిడీ... నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:56 IST)
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు డ్రా చేశాడు.
 
డబ్బు సంచిని బైక్ డిక్కీలో ఉంచాడు. ఆ తర్వాత టిఫిన్‌ సెంటర్ కి వెళ్లి టిఫిన్ చేశాడు. అనంతరం తన దుకాణానికి వెళ్లాడు. బైక్‌లో డబ్బు కోసం చూడగా షాక్ కి గురయ్యాడు. డిక్కీలో డబ్బు సంచీ కనిపించలేదు. డబ్బు చోరీకి గురైందని తెలుసుకుని వెంటనే లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.
 
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి. డబ్బును ఓ వ్యక్తి దొంగిలించడాన్ని పోలీసులు గుర్తించారు. బైక్‌లో డబ్బుల సంచి పెడుతుండగా సమీపంలోనే ఉండి ఓ దొంగ గమనించాడు. వాహనదారుడు టిఫిన్‌ చేసేందుకు వెళ్లగానే అదను చూసి బైక్ డిక్కీ తెరిచి ఆ మొత్తాన్ని దొంగిలించాడు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 
బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, బ్యాంకు అధికారులు నిత్యం చెబుతూనే ఉంటారు. బ్యాంకుల బయట దొంగలు ఉంటారని, మీకు తెలీకుండా అజ్ఞాత వ్యక్తి మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉంటాడని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతుంటారు. 
 
మీ డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా, కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించో, ఏమరపాటుగా ఉండో.. అడ్డంగా బుక్కవుతున్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు