ఏపీ నుంచి లక్షమంది వలస కూలీలు త‌ర‌లింపు... ఆరోగ్య సేతు యాప్‌పై జిల్లాల్లో ప్రత్యేక డాష్ బోర్డ్

గురువారం, 21 మే 2020 (06:56 IST)
ఇతర రాష్ట్రాలు,ఇతర దేశాల నుండి రాష్ట్రానికి వచ్చే వలస కూలీలు తదితరులను 14 రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ లేదా పెయిడ్ క్వారంటైన్‌లో ఉంచిన తదుపరి వారిని ఇళ్ళకు పంపడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రం నుండి 57వేల మంది వలస కూలీలను బయట రాష్ట్రాలకు పంపగా మరో 47 వేల మందికి పైగా కూలీలను బయిటకు పంపడం జరుగుతుందని చెప్పారు. 
 
ఎవరు రాష్ట్రంలోనే ఉండాలను కుంటున్నారు ఎవరెవరు స్వంత ప్రాంతాలకు వెళ్ళాను కుంటందీ నిర్ణయించి ఆప్రకారం చర్యలు తీసుకోవాలని సిఎస్ చెప్పారు.వలస కూలీలను తరలించే ప్రక్రియను మరికొన్ని రోజులు కొనసాగించాలని అన్నారు.విదేశాల నుండి 13వేల మందికి పైగా వస్తున్నారని వారిని 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని సిఎస్ చెప్పారు.

ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిని గ్రామాల్లో ఎఎన్ఎం,ఆశా వర్కర్ లు వారిని ఎప్పటి కప్పుడు ట్రాక్ చేసేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ఆరోగ్య సేతు యాప్‌నకు సంబంధించి ప్రత్యేక డాష్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అంద‌లో వ్య‌క్తి పేరు, ఫోన్ నంబరు జిల్లా పేరు వివరాలను అందు బాటులో ఉంచి ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేలా చూడాలని స్పష్టం చేశారు. 
 
కరోనా టెస్టింగ్ పెద్ద ఎత్తున చేపట్టి పాజిటివ్ కేసులు గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ దుకాణాలు వద్ద పాటించాల్సిన ప్రామాణిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని ఒకేసారి ఐదుగురుకి మించి దుకాణంలోకి అనుమతించ కూడదని సిఎస్ స్పష్టం చేశారు.                            
 
టిఆర్ఆండ్‌బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ ఈనెల 16నుండి 19 వరకూ 10వేల మందికి పైగా వలస కూలీలను శిబిరాల్లో ఉంచి వారిలో 6వేల మందిని పైగా స్వస్థలాలకు తరలించడం జరిగిందని తెలిపారు.ఉత్తర ప్రదెశ్ నుండి 6 శ్రామిక్ రైళ్ళకు అనుమతి వచ్చిందని,ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తుఫాన్ వల్ల ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్ళకు టైఆప్ చేయడంలో జెసిలు కృషి చేయాలని చెప్పారు.

ఇప్పటి వరకూ 22 రైళ్ళకు అనుమతులు వచ్చాయని మరో 10రోజుల వరకూ వలస కూలీలను పంపే ప్రక్రియను కొనసాగించాలని చెప్పారు. ఈనెల 21,22 తేదీల్లో కువైట్ నుండి రెండు విమానాలలో 2వేల 500 మంది వరకూ  విశాఖపట్నం విజయవాడ లకు రానున్నాయని కావున ఆ రెండు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

గురువారం నుండి పరిమిత సంఖ్యలో అంతర్ జిల్లా బస్సు సర్వీసులు జిల్లా కేంద్రాలకు, ఇతర ముఖ్య ప్రాంతాలకు బస్టాండ్ టు బస్టాండ్ కు నడవనున్నాయని చెప్పారు. గ్రవుండ్ బుక్కింతోనే బస్సులు నడపడం జరుగుతుందన్నారు. పరిస్థితిని చూశాక మరిన్ని సర్వీసులు నడపడం జరుగుతుందని తెలిపారు. బస్సు సామర్థ్యంలో 50 శాతం మందితోనే నడపడం జరుగుతుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు